ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదిన ప్రత్యేక సంచిక
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలో ఆరంగ్రేటం చేసి, తనదైన ముద్ర వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజల సేవే లక్ష్యంగా, బీర్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసి కరోనా సమయంలో ఆలేరు పట్టణ, నియోజకవర్గ ప్రజలకు, మీడియా సోదరులకు నేనున్నానని భరోసా కల్పిస్తూ, కరోనాను లెక్కచేయకుండా, చావులు, బ్రతుకులకి, ప్రతి చోటా నేనున్నానని, మీరు అధైర్య పడవద్దని నియోజకవర్గ ప్రజలకు నిస్వార్ధంగా ఆయన సేవలు అందించారు. ప్రజల పక్షాన నిలిచి పనిచేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. దీంతో ప్రజలు ఆయనను అక్కున చేర్చుకొని, మాజీ ఎమ్మెల్యే సునీతపై 50 వేల పైచీలకు మెజార్టీ అందించి ఎమ్మెల్యేగా గెలిపించారు.
అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఆలేరు నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సేవలందిస్తున్నారు. గంధ మల్ల చెరువు నుండి ఎండాకాలంలో సైతం ఆలేరు పెద్దవాగుకి నీరు వదలడంలో కీలకంగా పని చేసిన బీర్ల ఐలయ్య నిర్ణయాల కారణంగా ఆలేరు పరిసర ప్రాంతాలలో ఈ ఏడు గణనీయంగా ధాన్యం పండింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఆలేరు వ్యవసాయ మార్కెట్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజయవంతమయ్యారు.
ప్రజల సమస్యలను ఒక్కొక్కట్టిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. సాధారణ పేద కుటుంబంలో పుట్టి అట్టడుగు స్థాయి నుండి స్వయంకృషితో ఎదుగుతూ ప్రజల కష్టాలు తెలిసిన ఐలయ్య నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిగా మారి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రహదారుల, సినిమాటోగ్రఫీ మంత్రి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు చేదోడు, వాదోడుగా ఉంటూ అప్పగించిన బాధ్యతలను భుజాన వేసుకొని, క్రమశిక్షణ గల వ్యక్తిగా చెదరని ముద్ర వేసుకుంటున్నారు బీర్ల ఐలయ్య.
ఆలేరు పట్టణ అభివృద్ధి కొరకు తనదైన శైలిలో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అండగా ఉంటూ, పేద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి కావలసిన సిమెంటు, ఐరన్ అందజేస్తూ గృహప్రవేశాలకు నూతన వస్త్రాలను ఇస్తూ , గొర్రె పొట్టేలు బహుమతిగా అందిస్తూ.. పేదిండ్లలో సంతోషాన్ని నింపుతున్నారు. మరింత ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు కదులుతున్నారు.



