యాదాద్రి టెంపుల్‌కు గ్రీన్‌ యాపిల్‌ అవార్డు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అందించే ప్రతి ష్టాత్మక గ్రీన్‌ యాపిల్‌ అవార్డు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాల యానికి దక్కడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవమని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయం పాలనలో రాష్ట్రానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 13వ శతాబ్దంనాటి నరసింహస్వామి విగ్రహానికి నష్టం జరగకుండా, ప్రధాన ఆలయంలోకి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా, ఆలయ పరిసరాల్లో 40 శాతం గ్రీనరీతో విద్యుత్‌ వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఈ ఆలయాన్ని నిర్మించినందుకుగానూ ఈ అవార్డు దక్కిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్ధేశంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

 

Spread the love