కెనడాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

నవతెలంగాణ హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం కెనడా (Canada)కు వెళ్లిన హైదరాబాద్‌ వాసి (Hyderabad Student) కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించింది.  హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ముజమ్మిల్‌ అహ్మద్‌(25) 2022లో కెనడా వెళ్లాడు. ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్‌ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ… శుక్రవారం కార్డియాక్‌ అరెస్టు (Cardiac Arrest)తో అతడు మృతిచెందాడు. అతడి స్నేహితుడు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చినట్టు ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.
అహ్మద్‌ కుటుంబసభ్యులు కేంద్ర విదేశాంగశాఖకు రాసిన లేఖను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.  ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో లంగర్‌హౌజ్‌ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై దుంగడులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో.. తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం అదిస్తామని చికాగోలోని భారత ఎంబసీ హామీ ఇచ్చింది.

Spread the love