అహ్మదాబాద్‌, చెన్నై పిచ్‌లపై ఐసీసీ పూర్‌ రేటింగ్‌.. ద్రావిడ్‌ కౌంటర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుత వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన అహ్మదాబాద్‌, చెన్నై పిచ్‌లు స్లో బౌలర్లకు అనుకూలించాయని, ఈ కారణంగా ఈ రెండు పిచ్‌లకు సగటు రేటింగ్‌ ఇచ్చిన ఐసీసీకి టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఐసీసీ అభిప్రాయాన్ని తప్పుబట్టాడు. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. చెన్నైలో ఆస్ట్రేలియాను భారత్‌ 199 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత సునాయాసంగా లక్ష్యాలను ఛేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పిచ్‌లు స్లో బౌలర్‌లకు తోడ్పడ్డాయని, అందుకే ఇండియా బౌలర్లు రాణించారని, ఆ తర్వాత బ్యాటర్లు ఈజీగా లక్ష్యాన్ని చేరుకున్నారని ఐసీసీ ఆరోపించిన విషయం తెలిసిందే. అన్నీ 350కిపైగా స్కోర్‌ రాబట్టగలిగే పిచ్‌లు ఉండాలని అనడం సరికాదని రాహుల్‌ ద్రావిడ్‌ అన్నాడు. ఎలాంటి పిచ్‌ అయినా ఆటగాళ్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కౌంటర్‌ ఇచ్చాడు. ఒకవేళ 350-పరుగులు నమోదైన పిచ్‌లకు మాత్రమే మంచి రేటింగ్‌ చేయాలనుకుంటే తాను విభేదిస్తానని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల ప్రదర్శనలో విభిన్న నైపుణ్యాలను కూడా పరిగణించాలని, ఫోర్లు మరియు సిక్సర్లు కొట్టడాన్ని మాత్రమే చూడాలనుకుంటే అది టీ20లో సాధ్యమవుతుందని, మిగతావన్ని ఇంకేందుకు? అని ఐసీసీని రాహుల్‌ ద్రావిడ్‌ ప్రశ్నించాడు. బౌలర్లు రాణిస్తే తక్కువ రేటింగ్‌ ఇస్తారా అని నిలదీశాడు. ఆస్ట్రేలియాపై చెన్నైలో విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఎలా బ్యాటింగ్‌ చేశారనేది గమనించాలని హితవు పలికాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Spread the love