పట్టుదల ఉంటే పోటీ పరీక్షల్లో రాణించొచ్చు

పట్టుదల ఉంటే పోటీ పరీక్షల్లో రాణించొచ్చు– సివిల్స్‌ ర్యాంకర్‌ అడుసుమిల్లి మౌనిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భాషపై అవగాహన, పకడ్బందీ ప్రణాళిక, అందుకు తగిన కృషి, పట్టుదలతోపాటు వ్యక్తిగతంగా నోట్స్‌ తయారు చేసుకునే విధానం ఉంటే ఎవరైనా పోటీ పరీక్షల్లో రాణించొచ్చని సివిల్స్‌ ర్యాంకర్‌ అడుసుమిల్లి మౌనిక అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య విజేత మౌనికను ఆ అకాడమీ అడ్వైజర్‌, చీఫ్‌ గార్డెనర్‌, ఎక్స్‌ ఐఓఎఫ్‌ఎస్‌ అడిషనల్‌ కమిషనర్‌ వై సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ సురేందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్‌ దండు జనార్ధన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కె సతీశ్‌కుమార్‌ శాలువాతో సత్కరించి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మౌనికకు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయనీ, భవిష్యత్తులో వాటిని సాధించేందుకు మరింత పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. అనంతరం అకాడమీలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మౌనిక సమాధానమిచ్చారు. వారిలో ఉన్న అపోహలను తొలగించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు మెళకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది అల్లు వెంకటేశ్‌, బి రాజేందర్‌, బి రంజిత్‌కుమార్‌, బి సంధ్యారాణి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జీ కోట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love