నవతెలంగాణ – విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 9న పెన్ డౌన్, సెల్ఫోన్ డౌన్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జులై నెలాఖరు నుంచి విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే. 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విద్యుత్ సౌధ పరిసరాల్లో పోలీసు బందోబస్తును విజయవాడ నగర డీసీపీ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉద్యోగుల ముసుగులో అసాంఘిక శక్తులు నగరంలోకి చొరబడి అలజడి సృష్టించే అవకాశం ఉన్నందన ముందస్తు చర్యల్లో భాగంగానే గస్తీ ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు.