– లోక్సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు : రాహుల్ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరచనున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 90 శాతం పేద వర్గాలకు చెందిన ప్రజలు తమ వెంట ఉన్నారని, ఇండియా ఫోరమే అధికారంలోకి రానుందని తెలిపారు. గురువారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి ఆయన లంచ్ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు సీట్లకు ఏడూ ఇండియా ఫోరమే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మోడీ, బీజేపీ దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు. మోడీ ప్రధానిగా 22 మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పని చేశారని విమర్శించారు. దేశ సంపదను అదానీకి దోచిపెట్టారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని రాహుల్ వ్యాఖ్యానించారు.