బాలిక భారమేనా?

Is the girl a burden?బాలిక అంటే భారం. ఆడపిల్లంటే అత్తారింటి ఆడదే అనే చిన్న చూపు దేశంలో నేటికీ కొనసాగుతోంది. నిర్భయలు, ఉన్నావ్‌లు, హత్రాస్‌లు, దిశల గత భయానక అనుభవాలతో అనుక్షణం శీలాన్ని అరచేతిలో పెట్టుకొని భయపడుతూ బతుకుతున్నారు సున్నిత అభాగ్య అబలలు. ప్రపంచవ్యాప్తంగా 18 ఏండ్లలోపు వయసున్న బాలికలు 1.1 బిలియన్లు. విశ్వ వ్యాప్తంగా బాలికల పలు సమస్యలు, భద్రత, సాధికారత, లింగ వివక్ష, విద్య వంటి అంశా లను చర్చించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కెనడా మహిళ ‘రోనా ఆంబ్రోస్‌’ చొరవతో ఐక్యరాజ్యసమితి 2012 నుండి ప్రతియేటా 11 అక్టోబర్‌ న ”అంత ర్జాతీయ బాలికల దినం (ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ గర్ల్‌ చైల్డ్‌)” నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
బాలికలను విద్యకు దూరం చేయడం, అమ్మాయిల్ని వంటింటికి పరిమితం చేయడం, బాల్యవివాహాలు, పోషకాహారలోపం, హక్కుల్ని కాలరాయడం, కుటుంబంలో నిర్ణయా ధికారం లేకుండా ద్వితీయ శ్రేణి పౌరురాలిగా పక్కన బెట్టడం, వివక్ష నుండి రక్షించడం, లైంగిక హింసలు, మానభంగాలు, బాలికల్ని కార్మికులుగా మార్చడం, వైద్య సదుపాయాల లేమి, లింగవివక్ష లాంటి పలు సమస్యలు అనాదిగా వస్తు న్నాయి. విశ్వవ్యాప్తంగా 62 మిలియన్ల బాలికలు నిరక్షరాస్యతతో సతమతమవుతూ వంటింటికి, తమ వృత్తులకే పరిమి తమవుతున్నారు. బాలికల్లో 25 శాతం బలవంతంగా బాల్యవివాహాలు ఉచ్చులో పడుతు న్నారు. మన దేశంలో పదేండ్లు దాటిన బాలికలకు నేటికీ బాల్య వివాహాలు, బాలికల్ని పనిలో పెట్టు కోవడం, ఫీమేల్‌ జనిటల్‌ మ్యుటిలేషన్‌ లాంటి దురాచారాలకు గురవుతున్నారు. పేద కుటుంబాలలో 80 శాతం బాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరమవుతున్నారు. ప్రపంచ బాల్యవివాహాలలో 33 శాతం భారత్‌లోనే జరుగుతు న్నాయని అంచనా. భారత మహిళల్లో 75 శాతం ఏదో ఒక గృహహింసకు గురవుతున్నారు. గ్రామీణ బాలికలు వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, బాల్య వివాహాలు, వంట పనులు, ఇటుక బట్టీలు, అసంఘటిత రంగాల్లో తమ బాల్యాన్ని కోల్పోతున్నారు.
అంతర్జాతీయ బాలికల దినం-2023 సందర్భంగా ”అవర్‌ జనరేషన్‌, అవర్‌ జనరేషన్‌” అనబడే నినాదం తీసుకున్నారు. కౌమారదశలో ఉన్న అమ్మా యిలను లింగవివక్ష లేకుండా సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆకర్షించడానికి ప్రభుత్వాలు పలు చట్టాలను చేశాయి. బాలికలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్య సదు పాయాలు, గౌరవప్రద జీవితం, ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, లైంగిక వేధింపుల కట్టడి, అత్యాచారం చేసిన వారికి కఠిన దండన, హక్కుల కల్పన, ఆస్థి హక్కు, నాయకత్వ అవకాశాల కల్పన, గృహహింస లేకుండా చూడ డం, నైపుణ్యాభివృద్ధి, మహిళా భద్రత, బాల్యవివాహాల రద్దు, అన్ని రంగాల్లో సమానత్వానికి సాకారాత్మక చర్యలు తీసుకోవడం. అయితే క్షేత్రస్థాయిలో ఇవి నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్త్నున్నాయి.
భారతదేశంలో 2020 అంచనాల ప్రకారం 108 మంది పురుషులకు 100 మంది మహిళలు ఉన్నారు. ఇండియా జనాభాలో 51.96 శాతం పురుషులు, 48.04 శాతం మహిళలు. ప్రపంచ వ్యాప్తంగా పురుషులు 50.4 శాతం, స్త్రీలు 49.6 శాతం ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలుగా గర్భంలో అమ్మాయి ఉందని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడడం, ఆరోగ్య సదుపాయాల లేమి, బాల్యవివాహాలతో కౌమారదశలోనే గర్భం దాల్చడం, ప్రసూతి ఆసు పత్రులు సమీపంలో లేకపోవడం, అవిద్యతో అవగాహనాలేమి లాంటివి చెప్ప వచ్చు. భ్రూణహత్యల్లో 90 శాతం గర్భస్థ శిశువు ఆడపిల్ల కారణమని తేలింది. దీనిని గమనించిన ప్రభుత్వాలు లింగనిర్థారణ పరీక్షలను నిషేధించినా అక్కడ క్కడా భ్రూణహత్యల పరంపర కొనసాగుతూనే వుంది. అయితే భ్రూణహత్యల నిరోధానికి ‘కిషోరి శక్తి యోజన’, ప్రసూతి వైద్య సదుపాయాల కల్పనకు ‘సమృద్ధి యోజన’, వైద్య సదు పాయాల కల్పనకు ‘ఆయుస్మతి యోజన’ పథకాలను తీసు కొచ్చారు. కేంద్రం 2015లో తెచ్చిన ”బేటీ బచావో, బేటీ పడావో” పథకం నిరూప యోగంగానే కనిపిస్తున్నది. ఆడపిల్లల్ని రక్షించుకోవడం, ఉన్నత విద్య అందిం చడం, భ్రూణహత్యలను నిరోధించడం, మహిళలపై అత్యాచారాలను కట్టడి చేయడం లాంటి చర్యలతో లింగ వివక్ష సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అమ్మాయిల మానసిక, సాంఘీక, భౌతిక, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తగు చర్యలు తీసుకోవాలి. యువతులపై ఆసిడ్‌ దాడులు, భ్రూణహత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, భౌతిక గృహహింస, కిడ్నాపులు లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
(11 అక్టోబర్‌ ‘అంతర్జాతీయ బాలికల దినం’)
– బిఎంఎస్‌ రెడ్డి, 9949700037

Spread the love