– సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో దిగ్భ్రాంతి
– అమెరికాకు వంతపాడే వైఖరిని మోడీ ప్రభుత్వం వీడాలని డిమాండ్
న్యూఢిల్లీ: గాజా నగరంలో ఇజ్రాయెల్ సేనలు జరిపిన కాల్పుల్లో 112 మంది పాలస్తీనియన్లు మరణించడం, అనేక మంది గాయపడడం పట్ల సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఆకలితో మలమలమాడుతున్న ప్రజలు ఆహార ప్యాకెట్ల కోసం ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కుల వద్ద గుమికూడినప్పుడు, వారిపై ఇజ్రాయిల్ సేనలు కాల్పులు జరిపి నెత్తుటేరులు పారించడం అత్యంత హేయమైన చర్య అని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహౌమంలో ఇప్పటివరకు 30,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని పొలిట్బ్యూరో శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. .ఇంతటి ఘోర మారణకాండ జరిగినా భారత ప్రభుత్వం నోరు మెదపకపోవడం అత్యంత శోచనీయమని పేర్కొంది. గాజాపై జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికాకు వంతపాడే వైఖరిని మోడీ ప్రభుత్వం విడనాడాలని పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా, బ్రెజిల్ అరబ్ దేశాల వంటి గ్లోబల్ సౌత్ దేశాలతో సమన్వయం చేసుకుని గాజాలో తక్షణ , శాశ్వత కాల్పుల విరమణ కోసం తగు యత్నాలు వెంటనే చేపట్టాలని పొలిట్బ్యూరో కోరింది.