బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది. సోదాల్లో కీలక మైనా సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డిలకు చెందిన నివాసాలు, వ్యాపారాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరుసగా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఒకేసారి ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్‌ సోదాలు జరగినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్‌ఎస్‌ నేతల నివాసాలు, వ్యాపారాల్లో పలు కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

Spread the love