నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లో భారాసకు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి (నాగర్కర్నూలు), పైళ్ల శేఖర్రెడ్డి (భువనగిరి) ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని మర్రి జనార్దన్రెడ్డి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో శేఖర్రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను ఐటీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు నగరంలోని వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు జరుగుతున్నాయి.