నవతెలంగాణ – ఒడిశా: రైలు ప్రమాదానికి గురైన దాదాపు అర్ధగంటలోపే ఎన్డీఆర్ఎఫ్ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ బృందం అంత వేగంగా అక్కడకు చేరుకోవడానికి కోరమాండల్లో ప్రయాణిస్తున్న ఓ ఎన్డీఆర్ఎఫ్ జవాన్ కారణం. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే జీపీఎస్ లొకేషన్, ప్రమాదం ఫొటోలను ఉన్నతాధికారులకు చేరవేశాడు. వెంకటేశన్ ఎన్కె అనే 39 ఏళ్ల జవాన్ తన బంధువు పెళ్లిలో పాల్గొనేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అతడికి బీ-7 కోచ్లోని 68 నెంబర్ సీటు వచ్చింది. ప్రయాణం మొదలుకాగానే అతడు తన ఫోన్లో నిమగ్నమయ్యాడు. రాత్రి దాదాపు 7 గంటల సమయంలో రైలు భారీ శబ్దంతో కుదుపులకు లోనైంది. ఎదురుగా స్లీపర్ బెర్తులో పడుకొన్న వ్యక్తి కిందపడ్డాడు. మరోవైపు ఓ తల్లిచేతిలో ఉన్న బిడ్డ కిందపడింది.. దీంతో భారీ బాంబుపేలుడు జరిగిందేమోనని భావించిన వెంకటేశన్ అప్రమత్తం అయ్యాడు. వెంటనే రైలు బోగి నుంచి బయటపడ్డాడు. ఫోన్లో టార్చ్ను ఆన్ చేసి.. అక్కడ దృశ్యాన్ని చూసిన వెంటనే కోచ్ల్లో చిక్కుకొన్న వారిలో కొందరిని కాపాడాడు. ఆ చప్పుడు విని అక్కడకు చేరుకొన్న స్థానికులకు పలు సూచనలు చేశాడు. కానీ, పరిస్థితి ఘోరంగా ఉండటంతో.. వెంటనే తన పై అధికారి అయిన ఇన్స్పెక్టర్కు ఈ విషయాన్ని ఫోన్లో తెలియజేశాడు. దీంతోపాటు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొన్నాడు. ప్రమాదం ఫొటోలను అధికారులకు చేరవేశాడు. కొద్దిసేపటి తర్వాత జీపీఎస్ లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఈ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మొహిసీన్ షాహెది మాట్లాడుతూ.. ‘‘వెంకటేశన్ తొలుత మాకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే మా హెడ్క్వార్టర్స్లోని సీనియర్ అధికారి అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన పావుగంటలోనే బాలేశ్వర్లోని తొలి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలికి చేరింది. ఆ తర్వాత మిగిలిన బృందాలు కూడా అక్కడకు వచ్చాయి’’ అని వెల్లడించారు. దాదాపు 300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రైలు ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొన్నారు.