మంచినీళ్లు అడిగిన వికలాంగుడిపై జవాన్ల దాడి

లక్నో : దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు అడిగిన ఓ వికలాంగుడ్ని ఇద్దరు జవాన్లు చితక బాదిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, 2016లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సచిన్‌ అనే వ్యక్తి తన రెండు కాళ్లూ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు స్థానిక రెస్టారెంట్‌లో డెలివరీబారుగా జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక్‌ జవాన్లను మంచినీళ్లు అడిగాడు. ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చితక్కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితులను రాజేంద్ర మణి, అభిషేక్‌ సింగ్‌గా గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించినట్టు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.

Spread the love