టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఐక్య పోరాటాలు చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న జేఏసీలోకి ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసిరావాలని టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కే యాదయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యి, పలు అంశాలపై విస్త్రుత చర్చ జరిపారు.
ఇతర కార్మిక సంఘాలను జేఏసీలోకి ఆహ్వానిస్తూ ఈనెల 22న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ఏర్పాటు చేశామనీ, అన్ని యూనియన్ల నేతలు తప్పకుండా దీనికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సమావేశం నుంచే అన్ని సంఘాల నేతలకూ ఫోన్లు చేసి, ఆహ్వానించామన్నారు. కార్మికుల విస్త్రుత ప్రయోజనాల రీత్యా సంఘాల ఐక్యత అనివార్యమనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు పీ రవీందర్రెడ్డి, కే గంగాధర్, జీఆర్ రెడ్డి, ప్రకాష్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకట్గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.