– పదేండ్ల పాటు విచారణ సాగితే అప్పటి వరకూ జైల్లోనేనా?: సునీతా కేజ్రీవాల్
భావనగర్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కాషాయ పాలకులు బలవంతంగా జైలుపాలు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి 40 రోజులైందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్నదని వారు చెబుతున్నారని, విచారణ పదేండ్ల పాటు సాగితే కేజ్రీవాల్ను వారు పదేండ్లు జైలులో ఉంచుతారా అని సునీతా కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్లోని భావనగర్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కాషాయ పాలకుల తీరు స్పష్టంగా నియంతృత్వమేనని అన్నారు. నిజాయితీ, దేశభక్తి కలిగిన ఉన్నత విద్యావంతుడైన కేజ్రీవాల్ను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక సేవ కోసం కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మురికివాడల్లోకి వెళ్లి అక్కడి ప్రజల కోసం పనిచేశారని చెప్పారు. తమకు పెండ్లయిన తర్వాత ఆయన తనను ఒకటే ప్రశ్న అడిగారని, తాను సామాజిక సేవ చేయాలని అనుకుంటున్నానని, ఈ విషయంలో నీకేమైనా ఇబ్బందులున్నాయా అని అడిగారని ఆమె గుర్తు చేసుకున్నారు.