కోడి కత్తి కేసు.. శ్రీనివాస్‌కు బెయిల్‌

నవతెలంగాణ – అమరావతి: కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉంటున్న ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. 2018, అక్టోబర్‌ 25న విశాపట్నం విమానాశ్రయంలో జగన్‌మోహన్‌ రెడ్డిపై కోడికత్తితో శ్రీనివాస్‌ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నేడు బెయిల్‌ మంజూరుచేసింది.

Spread the love