ఆంధ్రోళ్ళ బూట్లు నాకి రేవంత్ సీఎం అయ్యారు: కేటీఆర్

 

నవతెలంగాణ – హైదరాబాద్:  సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ కి దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయాలని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సవాల్ ఎందుకు స్వీకరించడంలేదని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో ఇద్దరం పోటీ చేద్దాం. మనిద్దరిలో మగాడు ఎవరో తేలిపోతుంది అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిస్తేనే మగాడా… ఓడిపోతే మగాడు కాదా?… అలాగైతే రేవంత్ రెడ్డి నా సవాల్ ను స్వీకరించాలని అన్నారు. “మా నాన్న పేరు కేసీఆర్… ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాడ్ని నేను. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గాను. రేవంత్ రెడ్డిలా తప్పుడుదారుల్లో రాలేదు. ఆంధ్రుల బూట్లు నాకి, పార్టీ మారి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డే. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి. రేవంత్ ఇకనైనా చిల్లర మాటలు కట్టిపెట్టాలి” అని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతే నీ భరతం పట్టడం ఖాయం అని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. యువతుల వివాహ సమయంలో తులం బంగారం ఇస్తామని రేవంత్ ఎన్నికల వేళ ప్రకటించాడని, ఇంతవరకు తులం బంగారం ఇవ్వనేలేదని, ఇంకా కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులే ఇస్తున్నారని కేటీఆర్ వివరించారు. బంగారం లేదు..మన్నూ లేదు..మార్చి 17తో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల సినిమా పూర్తవుతుంది. 100 రోజులు పూర్తయ్యాక ఈ కాంగ్రెస్ పార్టీకి ఆడబిడ్డలే బొంద తవ్వుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Spread the love