పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి స్వల్ప ఊరట

నవతెలంగాణ – ముంబయి: పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. కోర్టు హాజరు నుంచి మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబయి హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగానూ బీజేపీకి చెందిన మహేశ్‌ శ్రీశ్రీమల్‌ 2021లో పరువునష్టం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణకు రాహుల్‌ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌వీ కొత్వాల్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా రాహుల్ గాంధీ హాజరు మినహాయింపును ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Spread the love