– కొత్తగా 87 పోస్టుల మంజూరు
– మెరుగుపడనున్న పనితీరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను భారీగా పునర్వ్యవ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు గత ఆరు నెలలుగా జరుగుతున్న కసరత్తుకు మంగళవారం జారీ చేసిన జీవోతో కొలిక్కి వచ్చినట్టయింది. దాదాపు 87 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా మంగళవారం జీవో 18 విడుదల చేశారు. అలాగే ఆయా హోదాల్లో ఉన్న ఇంజినీర్లకు అధికారాల బదలాయింపు సైతం చేశారు. దీనికోసం మరో జీవో నెంబరు 19 జారీ అయింది. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ మరింత చురుగ్గా పనిచేసేందుకు అవకాశం కలుగుతున్నది. రాష్ట్ర విద్యుత్, ఆర్ అండ్ బీ, సాగునీటి పారుదల శాఖ తరహాలోనే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను బలోపేతల చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈమేరకు ప్రతిపాదనలను పంపాలని గత ఏడాది నవంబరులో ఇంజినీర్ ఇన్ చీఫ్ ఏజీ సంజీవరావను ఆదేశించారు. దీంతో ఈఎన్సీ తన శాఖలో పని, ప్రస్తుతం ఉన్న పోస్టులు, అదనపు కావాల్సిన పోస్టులతో సమగ్రంగా నివేదిక పంపారు. దీన్ని పరిశీలించిన సీఎం మరోసారి పరిశీంచి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావుకు అప్పగించారు. ఆయా దశలు, స్థాయిల్లో సంప్రదింపుల అనంతరం పంపిన ప్రతిపాదలను తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేశారు. ఆ మేరకు మంగళవారం జీవోలు విడుదల అయ్యాయి. పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన అనంతరం అన్నిస్థాయిల్లో కొత్తగా మరో 87 పోస్టులు ఆయా స్థాయిల్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ శాఖ పనితీరు మరింత మెరుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం కొత్తగా నాలుగు చీఫ్ ఇంజినీర్, 12 సర్కిల్ ఇంజినీర్, 11 డివిజనల్ ఇంజినీర్, 60 సబ్ డివిజినల్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది. వివిధ స్థాయిల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం కల్పించింది. డీఈఈకి ఏడాదికి రూ. 5 లక్షలు, ఈఈకి ఏడాదికి రూ. 25 లక్షలు, ఎస్ఈకి రూ.కోటి, సీఈకి రూ.2.5 కోట్లు, ఈఎన్సీకి రూ.54 కోట్ల వరకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్ ఇంజినీరింగ్ శాఖలో సంబరాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఇవి జరిగాయి.