అదానీ తప్పిదాలను కప్పిపుచ్చేందుకే… : మల్లు రవి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మోడీని ఉపయోగించుకుని అదానీ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే…రాహుల్‌గాంధీని బీజేపీ క్షమాపణ కోరుతున్నదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. రాహుల్‌గాంధీ దేశ ప్రజాస్వామ్యానికి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. దేశంలో మోడీ నియంతృత్వ పాలన, అణచివేత ధోరణిపై ఆయన లండన్‌లో ప్రసంగించారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మల్లురవి మాట్లాడారు. పార్టీ సీనియర్లు సీఎం కేసీఆర్‌కు అమ్ముడు పోయారంటూ రేవంత్‌రెడ్డి అన్నట్టు ప్రచారం జరుగుతున్నదనీ, గతంలో పార్టీ మారిన కొంత మంది నాయకులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారని వివరణ ఇచ్చారు. రేవంత్‌ మాట్లాడిన విషయాలను జర్నలిస్టు సరిగ్గా అవగాహన చేసుకోకుండా కథనాలు రాశారని గుర్తు చేశారు. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, విక్రమార్క మధ్య అవగాహనతోనే ఈ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు.
పేపర్‌లీక్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు పాత్ర : చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
లిక్కర్‌ స్కామ్‌లో అమిత్‌షాను విచారించాలి : టీపీసీసీ
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో పెద్ద చేప అమిత్‌షాను విచారించాలని టీపీసీసీ నేత అద్దంకి దయాకర్‌, బెల్లయ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాలను అమిత్‌షా కుమారుడు పర్యవేక్షిస్తున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, ఆప్‌, వైసీపీ త్రయం లిక్కర్‌ స్కామ్‌ కథను నడిపాయని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఇందులో ఉందన్నారు. ఎక్సైజ్‌ పాలసీని ఆమోదించిన ఢిల్లీ లెప్టెనెంట్‌ గవర్నర్‌ను ఈ కేసులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అసలు దోషులను పక్కన పెట్టి కొంతమంది మామూలు వ్యక్తులను అరెస్టులు చేసి విచారిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, ఆప్‌ కలిసి కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు.

Spread the love