నాగర్ కర్నూలు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటా : మల్లు రవి

నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్ కర్నూలు లోక్ సభ సీటును తనకు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ టిక్కెట్‌ను తనకు ఇస్తారనే గ్యారెంటీ ఉందన్నారు. ఏ సర్వేలు చేసినా తానే ముందు నిలిచానన్నారు. తాను నాగర్ కర్నూలు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా వారితో కలిసిందని ఆరోపించారు. హిందూమత మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. బీజేపీ హిందూమతానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అవగాహనతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో పాలాభిషేకాలు లేవని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతామని తెలిసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Spread the love