అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఈరోజు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.. మరోవైపు అంగన్వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్‌ మీద కూడా సీతక్క సంతకం పెట్టారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇప్పుడు రూ.13,500 జీతం అందుకోనున్నారు. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Spread the love