అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే సీతక్క

– తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
నవ తెలంగాణ-గోవిందరావుపేట

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని దుంపలగూడెం గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. రైతే రాజు అని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నాయని, ఇప్పటికే వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వాలు, రైతన్న కష్టపడి పండించిన పంటకు కూడా ఆంక్షలు విధిస్తూ, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, క్వింటాకు 10 కిలోల తరుగును విధిస్తూ రైతుల కష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ములుగు జిల్లాలో వరి ధాన్యం సాగు ఎక్కువ అని తెలిసిన మిల్లులను కేటాయించకుండా, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనబడిన ధాన్యపు బస్తాలు ఇంకా అక్కడే ఉండడం వల్ల, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచడానికి సరైన వసతులు లేక, అకాల వర్షాల వల్ల తడిసిపోయాయి అని, వాహనాలు రాక రవాణా జరగక రైతులు వాహనాలకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది అని, ఇసుక రవాణాకు ఉచితంగా దొరికే వాహనాలు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి దొరక్కపోవడం విడ్డూరం అని అన్నారు. ములుగు లారీ అసోసియేషన్ కూడా దయచేసి రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని, సకాలంలో వాహనాలు పెట్టి ధాన్యాన్ని తరలించాలని వేడుకుంటున్న అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పండించిన ప్రతి గింజను మరియు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రాలలో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అని, పంట నష్టం వాటిల్లితే పంట నష్ట పరిహారం కల్పించాలని లేకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పెండెం శ్రీకాంత్, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆకుతోట చంద్రమౌళి, చింతనిప్పుల భిక్షపతి, వంగ రవి యాదవ్, గుండెబోయిన అనిల్ యాదవ్, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూడి సత్తిరెడ్డి, సామ చిట్టిబాబు, బొల్లు కుమార్, మూడ్ ప్రతాప్, సామ నరేందర్ రెడ్డి, లక్ష్మణ్, కట్ల జనార్దన్ రెడ్డి, నన్నెబొయిన సోమయ్య, కందుల అశోక్, మేడ ఎల్లారెడ్డి, సామ హన్మంత రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love