మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలి

– సామాజిక న్యాయ సేవ జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ
నవతెలంగాణ- తాడ్వాయి
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుండాలని సామాజిక న్యాయవేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ అన్నారు. మంగళవారం మండలంలోని బంధాల గ్రామపంచాయతీ పరిధిలో మహిళలతో అత్యవసర సమావేశమై మాట్లాడారు. కుటుంబ సభ్యులు తమ పిల్లల్లో ఆడ మగ అనే వ్యత్యాసం చూపెట్టకుండా సమానంగా ప్రోత్సహించాలని సూచించారు. మహిళలకు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించిన ఆదివాసి గిరిజన మహిళలకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉందని అన్నారు. రాజకీయంగా మహిళలను ఓటరుగానే ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. మహిళలకు రాజకీయంగా చైతన్యం వచ్చినప్పుడే మహిళ సాధికారత ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు అందరూ గొప్ప విద్యావంతులై అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ఈ క్రమంలో బంధాల ఏజెన్సీ ఆదివాసి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love