రోహిత్‌ వేముల కేసుపై సమగ్ర విచారణ జరపాలి: తమ్మినేని వీరభద్రం

– బీజేపీ నేతల కోసమే తప్పుడు నివేదిక
నవతెలంగాణ – హైదరాబాద్: ఎనిమిదేళ్ళ క్రితం కొంతమంది బీజేపీ నేతలు, హెచ్‌సీయు వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు వేధింపులు, మానసిక హింస, వివక్షకు గురై హెచ్‌సీయులో దళిత విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్‌ కులంపై జిల్లా కలెక్టర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే రాష్ట్ర పోలీసులు హడావుడిగా అత్యుత్సాహంతో తప్పుడు నివేదికను హైకోర్టుకు సమర్పించడం వెనక నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు, హెచ్‌సీయు వైస్‌ ఛాన్సలర్‌పై ఉన్న కేసులను ఎత్తివేయించడానికే అని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. ఈ నివేదిక ఆధారంగా కేసును మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో, ఈ కేసును మళ్ళీ పునర్విచారణ చేపడుతున్నట్టు రాష్ట్ర డీజీపీ ప్రకటించడాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తున్నది. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోహిత్‌ తల్లికి హామీ ఇవ్వడం సంతోషకరం. ఈ కేసును రాజకీయ అంశంగా చూడకుండా సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు ఏ యూనివర్సిటీలోనూ పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది.

Spread the love