నవతెలంగాణ ముంబయి: తమ నేతనే అడ్డుకుంటారా అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ కార్యకర్తలు ఓ టోల్ ప్లాజాపై దాడి చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టోల్ ప్లాజాను పూర్తిగా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే కాన్వాయ్ ని శనివారం రాత్రి సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ఉన్న సిన్నార్ టోల్ ప్లాజా వద్ద అరగంటపాటు నిలిపివేశారు. ఐడీ కార్డులు చూపించాలని టోల్ గేట్ సిబ్బంది అడిగారు. దీంతో ఆగ్రహించిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు మూడు కార్లలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆ టోల్ ప్లాజా వద్దకు చేరుకుని, టోల్ గేట్ను ధ్వంసం చేశారు. అలాగే అమిత్ థాకరే కాన్వాయ్ ని అడ్డుకున్న సిబ్బందితో క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు స్పదించలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు.