నవతెలంగాణ ముంబయి: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటికీ శిధిలాల నుండి బయటపడిన మృతుల సంఖ్య 27కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. రాయ్గఢ్ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించగా.. ఇంకా 81మంది ఆచూకి లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం నాలుగో రోజూ ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సరైన వెలుతురు లేకపోవడం, వాతావరణ ప్రతికూలతల నేపథ్యంలో సహాయక చర్యల్ని నిన్న రాత్రి నిలిపివేసిన అధికారులు.. ఆదివారం ఉదయం సహయ చర్యలను మళ్లీ ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదని పేర్కొన్నారు. కొండ చరియల కారణంగా కూలిన ఇండ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే.. వారు బతికే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు.