కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యం

– పన్నాల ఎల్లారెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బలరాం నాయక్ గెలుపును ఆశిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో భారత్ వెనకబడిపోయిందని అందుకు కారణం కూడా ప్రజలకు తెలుసని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన ఉండాల్సిన భారత్ ఇప్పుడు వెనుకబడి పోవడానికి మతోన్మాద పార్టీలే కారణమని అన్నారు. మధ్యతరగతి దిగువ తరగతి ప్రజానీకానికి గత పది సంవత్సరాల కాలంలో ఒరిగింది ఏమీ లేదని అంబానీ అదాని వంటి బడా పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరిందని అన్నారు. కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా పేదలను ఆర్థికంగా దివాలా తీయించి బడ బడ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినట్లే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఆరు నెలల లోపే 6 గ్యారంటీలను అమలుపరుస్తున్న కాంగ్రెస్ పార్టీని పనితీరును చూసి ఆదరించాలని అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల మన రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని అందుకు అందరము ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానంలో బలరాం నాయక్ నుఅధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవమున్న బలరాం నాయక్ ను గెలిపించి ఆయన అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love