భారతీయ కరెన్సీలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్లాస్టిక్ ఆధారిత (పాలిమర్) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సన్నాహాలు చేస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. 2027 నాటికి వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలి దశలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లను చలామణీలోకి తీసుకువచ్చి ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత దశలవారీగా విస్తరించాలని ఆర్బిఐ యోచిస్తోంది. అయితే పాలిమర్ నోట్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పాలిమర్ కరెన్సీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్బిఐ నోట్ల ముద్రణ విభాగం గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఇఒఐ) జారీ చేయగా.. ఆగస్టు 18 వరకు బిడ్లు ఆహ్వానించింది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ మన్నికను పెంచడం, తడిని తట్టుకోవడం, చిరిగిపోకుండా ఉండటం వంటి ప్రయోజనాల వల్ల పాలిమర్ నోట్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఈ తరహా కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి.
ఇక రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు
- Advertisement -
- Advertisement -



