మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

– జూన్‌ 3 వరకు నిర్వహణ
– సవరణ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ మూడో తేదీ వరకు అవి జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా శనివారం పరీక్షల సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుదిగడువు వచ్చేనెల రెండో తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. జూన్‌ నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అదేనెల పదో తేదీన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలుంటాయని తెలిపారు. జూన్‌ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యావరణ విద్య పరీక్ష, అదేనెల 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నైతికత, మానవ విలువలు పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Spread the love