– జై శ్రీరామ్ అంటూ నినాదాలు.. శ్రీరాముని జోలికొస్తే ఖబర్దార్ అంటూ ఓ వర్గం దాడి
– బైంసాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగిన కేటీఆర్ ప్రసంగం
నవతెలంగాణ- భైంసా
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బైంసాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార కార్యక్రమంలో ఓ వర్గానికి చెందిన వారు దాడి చేశారు. కేటీఆర్ రోడ్ షో స్థలానికి చేరుకోకముందే స్టేజి వద్దకు పెద్ద మొత్తంలో వారు చేరుకున్నారు. కేటీఆర్ రాగానే ఫ్లెక్సీలు ప్రదర్శించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. శ్రీరాముని జోలికొస్తే ఊరుకునేది లేదు.. ఖబర్దార్ అంటూ నినదించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కేటీఆర్ ప్రసంగిస్తుండగానే ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కేటీఆర్ ప్రసంగాన్ని కొనసాగించారు. కేటీఆర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడుతుంటే పోలీసులు అసలు ఉన్నారా ప్రశ్నించారు.