కాంగ్రెస్ ఏకైక ఎంపీ కన్నుమూత

నవతెలంగాణ – న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్ (47) మంగళవారం కన్నుమూశారు.కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే చెప్పారు. ఇతను అంతకుముందు శివసేనలో పనిచేశారు. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ సీటును గెలుచుకున్నారు. 2019వ సంవత్సరంలో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. చంద్రాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత హన్సరాజ్ అహిర్‌పై విజయం సాధించారు.వైద్య చికిత్స నిమిత్తం మే 28వతేదీన నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి విమానంలో ధనోర్కర్‌ను తరలించినట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. కడుపునొప్పి రావడంతో ఎయిర్ అంబులెన్స్‌లో దేశ రాజధానికి తరలించారు. మే 27వతేదీన నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో సురేష్ కిడ్నీలో రాళ్ల వ్యాధికి చికిత్స పొందారు. మే 27వతేదీన ధనోర్కర్ తండ్రి నారాయణ్ ధనోర్కర్ దీర్ఘకాలిక అనారోగ్యంతో నాగ్‌పూర్‌లో మరణించారు.అతని ఆరోగ్యం విషమించడంతో ఆదివారం జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ సురేష్ బాలు హాజరు కాలేదు.అంతలోనే ఈ విషాదం జరిగింది.

Spread the love