బీజేపీని ఎదుర్కొనే సత్తా ఎర్రజెండాకే ఉంది

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని గద్దె దించాలి
నవతెలంగాణ-ముదిగొండ
పేదవాడి కష్టంతోనే ప్రపంచం బతుకుతుందని, పేదవాళ్లు తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి సామినేని రామారావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. అణిచివేత, వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన సుందరయ్య.. వ్యక్తి కాదు మహాశక్తి అని అన్నారు. ఎర్రజెండా ఉన్నంతవరకు భూపోరాటాలు ఉంటాjని స్పష్టంచేశారు. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ఎర్రజెండాకే ఉందన్నారు. చిరుమర్రి గ్రామం ఉద్యమాలకు పేరొందిన గ్రామమని, చైతన్యవంతమైన యువత, యువకులు, ప్రజలు ఎర్రజెండాకు అండగా ఉండాలని ముందుకు రావటం హర్షనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, జిల్లాలో సీపీఐ(ఎం) సత్తా చాటాలన్నారు. మిగతా పార్టీల కంటే ఎర్రజెండా పార్టీలో ఉన్న వారికే గౌరవం దక్కిందన్నారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మతోన్మాద అరాచక శక్తులను ఎర్రజెండాతోనే తరిమికొట్టాలన్నారు. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌, బుగ్గవీటి సరళ, నాయకులు బండి పద్మ, మచ్చా లక్ష్మీ, రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువతీ, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love