బీఆర్ఎస్ పై తిరుగుబాటుకు ప్రజలు సిద్ధమయ్యారు

  – టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణ-ఆమనగల్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా బీఆర్ఎస్ పై తిరుగుపాటుకు సిద్ధమయ్యారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ పాలన నుంచి విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ తో కలసి వస్తున్నారని ఆయన చెప్పారు. ఆమనగల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లురవి మాట్లాడుతూ సుస్థిర ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని విశ్వసించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కేసీఆర్ అరాచక పాలనకు చరమగీతం తప్పదన్నారు. కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయంతో వణుకు మొదలైంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకొని అధికారం చేపడుతుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెల్చుకుంటుందని చెప్పారు. రైతుబంధు, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి పథకాలు ఇవ్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పై దుష్ప్రచారానికి ఒడిగట్టిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన, పాపాలకు ప్రజాక్షేత్రంలో తగిన శిక్ష తప్పదు అన్నారు. ఈనెల 31న కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టు మల్లు రవి పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, వస్పుల శ్రీశైలం, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడు ఎం.డి ఫరీద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love