సాదాసీదాగా గవర్నర్‌ ఎట్‌హోమ్‌

– సీఎం కేసీఆర్‌ డుమ్మా
– కానరాని మంత్రులు
– హాజరుకాని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కీలక నేతలు
– విందులో కనిపించని రాజకీయ నేతల హడావుడి
– హాజరైన హైకోర్టు సీజే, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో డాక్టర్‌ గవర్నర్‌ తమిళిసైసౌందరరాజన్‌ మంగళవారం తేనీటివిందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ‘రాజ్‌ భవన్‌ ఎట్‌ హౌమ్‌’ కార్యక్రమానికి కేసీఆర్‌ దూరంగా ఉండటం వరుసగా ఇది మూడోసారి. సీఎంతోపాటు మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలెవరూ హాజరుకాలేదు. దీంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలెవరూ రాలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం హాజరుకాకపోవడం గమనార్హం. బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా గైర్హాజరయ్యారు. దీంతో తేనీటి విందు కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావుడి కనిపించలేదు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, డీజీపీ, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. మరోవైపు అంతకు ముందే గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తేనీటి విందుకు కేసీఆర్‌కు ఆహ్వానం పంపించామని అన్నారు. ఆయన రావడం, రాకపోవడం రాజ్‌భవన్‌ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని అన్నారు. గవర్నర్ల పట్ల సీఎంల వైఖరి ఇలా ఉండటం మంచిది కాదని చెప్పారు.

Spread the love