నవతెలంగాణ ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని సంక్రాంతి పండుగ నాటికి అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28న మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని, బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని మాత్రం వదిలిపెట్టం. ఈ నెల 20న ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతాం’’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.