– మరో 14 రోజులు వేచి చూడనున్న ఇస్రో
న్యూఢిల్లీ : విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను చంద్రుడిపై అక్టోబర్ 6న వచ్చే సూర్యాస్తమయం వరకు పునరుజ్జీవింపజేసే ప్రయత్నాలను కొనసాగిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు తెలిపారు. పరికరాలతో సంప్రదింపులు ఎప్పుడు పునరుద్ధరింపబడతాయో ఖచ్చితంగా తెలియదని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ”అది ఎప్పుడు మేల్కొంటుందో మాకు తెలియదు. అది రేపు కావచ్చు, లేదా చాంద్రమాన దినం చివరి రోజు కూడా కావచ్చు. కానీ మేము ప్రయత్నిస్తున్నాము. ల్యాండర్, రోవర్ మేల్కొంటే అది గొప్ప విజయం అవుతుంది” అని సోమనాథ్ అన్నారు. కానీ, చంద్రుని రోజు పెరుగుతున్న కొద్దీ, చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, పునరుజ్జీవనానికి అవకాశం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జులై 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. 40 రోజుల ప్రయాణం తర్వాత విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువగా, సురక్షితంగా ల్యాండై ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచిన విషయం విదితమే.