117వ జయంతి సందర్భంగా
సీపీఐ(ఎం) నివాళి
న్యూఢిల్లీ: కామ్రేడ్ ప్రమోద్ దాస్గుప్తా 117వ జయంతిని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సీపీఐ(ఎం) ఆయనకు నివాళులర్పించింది. సోమవారం నాడు ఢిల్లీలోని హర్కిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం ఎ బేబీతో సహా పార్టీ పోలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వ్యవస్థాపక పొలిట్బ్యూరో సభ్యుడైన కామ్రేడ్ ప్రమోద్ దాస్గుప్తా తన జీవితమంతా శ్రామిక వర్గం, పీడిత ప్రజల విముక్తి కోసం అంకితం చేశారని సీపీఐ(ఎం) గుర్తు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసింది. విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1938లో పార్టీలో చేరకముందే వలస పాలకుల జైళ్లలో, నిర్బంధ శిబిరాల్లో ఎనిమిదేళ్లు గడిపారు. కలకత్తాలో డాక్ కార్మికులను సంఘటితం చేయడం నుంచి పార్టీ పత్రికా వ్యవస్థను నిర్మించడం వరకు, బ్రిటిష్ పాలనలోనూ, స్వాతంత్ర్యానంతరం కూడా పలుమార్లు జైలుపాలయ్యారు, అయిదు దశాబ్దాలకు పైగా ఎన్నో కష్టాలు, త్యాగాలు ఎదుర్కొంటూ నిజమైన విప్లవకారుడిగా జీవించారు. 1964లో సీపీఐ(ఎం) ఆవిర్భావం నుంచి 1982లో మరణించేంత వరకు ఉద్యమానికి అంకితమయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శిగా, పొలిట్బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్ ప్రమోద్, పార్టీ నిర్మాణం బలోపేతంలో నిర్ణాయక పాత్ర పోషించారు. రివిజనిజం, వామపక్ష దుందుడుకుతనానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం సాగించడం, అణచివేత, అర్ధ ఫాసిస్టు ఉగ్రవాద కాలంలో పార్టీని కాపాడటం, పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమిని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అచంచలమైన విప్లవ నిబద్ధత, సంస్థాగత దక్షత, మార్క్సిజం-లెనినిజం పట్ల జీవితకాల అంకితభావం నేటికీ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయి. అని సీపీఐ(ఎం) ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.
ప్రమోద్దాస్గుప్తా గొప్ప విప్లవకారుడు
- Advertisement -
- Advertisement -


