– బరిలో సమీర్ వర్మ, మాళవిక
– నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : భారత సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. థారులాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లో నిరాశపరిచిన ప్రణయ్.. సిడ్నీలో తుది ఫలితం మార్చటంపై దృష్టి నిలిపాడు. పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్గా బరిలోకి దిగుతున్న ప్రణయ్ తొలి రౌండ్లో బ్రెజిల్ షట్లర్తో తలపడనున్నాడు. యువ షట్లర్లు సమీర్ వర్మ, రవి తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు. ఇండోనేషియా షట్లర్ చికోతో సమీర్.. సింగపూర్ షట్లర్ కీన్తో రవి పోటీపడనున్నారు. మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ సహా శంకర్ ముతుస్వామిలు బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్ భారత పతక ఆశలను ముందుండి నడిపించనుంది. అష్మిత చాలిహ, మాళవిక బాన్సోద్, సామియ ఇమద్, అనుపమ, కెయురలు నేడు తొలి రౌండ్లో బరిలోకి దిగుతున్నారు. మెన్స్ డబుల్స్లో భారత్ నుంచి ఎవరూ పోటీపడటం లేదు. రుతుపర్ణ, శ్వేతపరణ జంట ఏడో సీడ్గా పోటీ పడనుంది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి.. తరుణ్, కృష్ణప్రియలు బరిలో నిలిచారు. కొంతకాలంగా నిరాశపరుస్తున్న సిక్కి, సుమిత్ జోడీ సిడ్నీలో మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 500 నేటి నుంచి ఆరంభం.