– నేడు బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో ఝార్కండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్కు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో రాధాకృష్ణన్ మంగళవారం రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురు అధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్ హైదరాబాద్లోని రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.