– సినిమాల్లో అవాస్తవాల చిత్రీకరణ
– మత విద్వేషాలకు బీజేపీ ఆజ్యం: విలేకరుల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీజేపీ నాయకుల సారథ్యంలో విడుదల కాబోతున్న ‘రజాకార్’ సినిమాను నిషేధించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ నేతలు కులం, మతం రంగు పూస్తున్నారని విమర్శించారు. అది వర్గ పోరు మాత్రమేనని, పేదలు, భూస్వాముల మధ్య జరిగిన పోరాటమని తెలిపారు. పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలు వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. దానిని మతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను పక్కనపెట్టి అవాస్తవాలతో చిత్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు విడుదల కావడం వల్ల ప్రజల్లో విభేదాలు వస్తాయని వెంటనే ఆ సినిమాను సెన్సార్ బోర్డు నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఆనాటి పోరాటంలో ఆర్ఎస్ఎస్ నైజాం నవాబుకు అనుకూలంగా వ్యవహరించిందని, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు సహకరిం చిందని చెప్పారు. తెలంగాణలో ప్రజలందరూ సామరస్యంగా జీవిస్తున్నారని, ఇలాంటి ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. విభేదాలు సృష్టించే సినిమాలను సెన్సార్ బోర్డు నిషేధించాలని కోరారు.
పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామమని, సాకులు చూపి బిల్లు అమలు కాకుండా చూసినా, ఆటంకాలు సృష్టించినా ఊరుకోబోమన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మహిళా బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులు లేకుండా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర యూనిట్గా దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపి పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయించాలన్నారు. దీనివల్ల ఎన్నికల వ్యయం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు కందుకూరి రమేష్, లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.