చట్టసభల్లో వామపక్షాల ప్రాతినిధ్యం అవసరం

– రాగిరెడ్డి వీరారెడ్డి ఆశయాలను సాధించాలి : వర్ధంతి సభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వామపక్షాలు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రాగిరెడ్డి వీరారెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వీరారెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు రాజకీయాలు కార్పొరేట్‌ రాజకీయాలుగా మారిపోయాయని, డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు కరువయ్యారని, చట్టసభల్లో ప్రజా గళం వినిపించే నాయకుడు లేకపోవడంతో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. నిత్యం ప్రజల కోసం ఉద్యమాలు చేసే కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాల నాయకులు అసెంబ్లీ, పార్లమెంటులో అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేదలకు భూమి ఇవ్వాలని రాగిరెడ్డి వీరారెడ్డి విరోచితమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్రామంలో పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. భూస్వాములు అతనిని హతమార్చి ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారన్నా రు. వీరారెడ్డి చూపిన మార్గంలో నేడు కార్యకర్తలు నడుస్తున్నారని, ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తోందని, రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోంద ని ఆరోపించారు. మనుషులు, జాతులు, తెగల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని నాశనం చేస్తోందని వాపోయారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పచెప్పు తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గ్రామస్థాయిలో సీపీఐ(ఎం) నిర్మాణం కోసం రాగిరెడ్డి వీరారెడ్డి ఎంతో కృషి చేశారనితెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌ అన్నారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మూడవ త్‌ రవి నాయక్‌, జిల్లా కమిటీ సభ్యులు బావాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడల పరుశరాములు, వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, వినోద్‌నాయక్‌, ఎండీ.అంజద్‌, సీనియర్‌ నాయకులు గాదె పద్మ, పగిదోజు రామ్మూర్తి, వేములపల్లి వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్ధన పాల్గొన్నారు.

Spread the love