ఓటు వేయడానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదం

ఓటు వేయడానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదం– ముగ్గురు మృతి..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ-జనగామ
ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తూ రోడ్డు మీద టిఫిన్‌ చేస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండల కేంద్రం సమీపంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బీబీనగర్‌లో రోజువారీ కూలీ చేసుకొని బతుకుతున్న వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన తెలకలపల్లి రవీంద్ర (35), తెలకలపల్లి జ్యోతి (32), తెలకలపల్లి భవిష్‌ (10) ద్విచక్ర వాహనం మీద వరంగల్‌కు వెళ్తూ రఘునాథ్‌ పల్లి సమీపంలో జాతీయ రహదారి ఆనుకొని ఉన్న మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి టిఫిన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుండి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి మొబైల్‌ టిఫిన్‌ వాహనం మీదకి దూసుకెళ్లింది. దాంతో టిఫిన్‌ చేస్తున్న కుటుంబంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందారు. క్యాంటీన్‌ నిర్వాహకులు రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండా చెందిన నునావత్‌ శ్రీకాంత్‌, నునావత్‌ సంతోష్‌ తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దూదిమెట్ల నరేష్‌ తెలిపారు.

Spread the love