మహారాష్ట్ర కూలీ మృతి
23 మంది కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా
పలువురికి గాయాలు..
ఇద్దరి పరిస్థితి విషమం
వరంగల్ ఎంజీఎంకు తరలింపు
బాధితులకు ప్రభుత్వ విప్
ఆది శ్రీనివాస్ పరామర్శ
నవతెలంగాణ – వేములవాడ/ వేములవాడ రూరల్
వరి నాట్లు వేసి తిరుగు ప్రయాణంలో ఉన్న వలస కూలీల వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మహారాష్ట్రకు చెందిన అతుల్(35) అక్కడికక్కడే మృతిచెందాడు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో గురువారం సాయంత్రం జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
మహారాష్ట్ర కూలీలు 23 మంది వేములవాడ అర్బన్ మండలంలోని అనుపరంలో వరి నాట్లు వేసేందుకు వచ్చారు. పని పూర్తయ్యాక సాయంత్రం టాటా ఏస్ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. అనుపురం గ్రామ శివారులో ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. స్థానికులు వెంటనే పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో కూలీలను వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన అతుల్(35) అక్కడికక్కడే మృతిచెందాడు. అర్చన, ప్రభావాణి, ప్రభాకర్, జనార్ధన్, మోరేశ్వర్పాటు మరికొందరు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సీఐ వీరప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ వేములవాడ ఏరియా ఆస్పత్రిలో కూలీలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


