హైదరాబాద్ : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యుటిఐటిసి) చైర్మన్ సందీప్ మఖ్తల అమెరికా, కెనడా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలోనే తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ డబ్ల్యుటిఐటిసి స్కై సోరర్ను ఆవిష్కరించారు. దీంతోపాటుగా పలు యూనివర్సిటీలు, సంస్థలతో ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి తరఫున చైర్మన్ సందీప్ మఖ్తల కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆగస్టు 5, 6 తేదీల్లో సింగపూర్లోని షాంగి ఎక్స్పోలో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలో చోటు చేసుకునే నెట్ వర్క్, లెర్న్, ఇన్వెస్ట్మెంట్ అవకాశాల గురించి సైతం ఈ సందర్భంగా విపులంగా చర్చకు వచ్చింది. కెటిఆర్ పర్యటనలో సందీప్ ముఖ్తల ఐటీ పరిశ్రమకు చెందిన ఇన్వెస్టర్లు, స్టార్టప్ల ప్రతినిధులు, నిపుణులు, అమెరికా, కెనడా దేశాలకు చెందిన వివిధ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. మంత్రి కెటిఆర్ చే స్కై సోరర్ ఆవిష్కరణ, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రతో ఒప్పందం, సిలికాన్ వ్యాలీలో డబ్ల్యుటిఐటిసి కార్యాలయం, కెనడాలో తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో కలిసి పర్యటించారు.