నవతెలంగాణ-చెన్నై: వేసవి సెలవుల అనంతరం జూన్ 1వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో 1 నుంచి ప్లస్ టూ తరగతుల వరకు వార్షిక పరీక్షలు ముగిసి గత నెల 28వ తేది నుంచి సెలవులు ప్రకటించారు. అప్పుడే జూన్ 1వ తేది 6 నుంచి ప్లస్ టూ వరకు, 5వ తేది నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ, రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో, పాఠ శాలల పునఃప్రారంభంలో ఆలస్యం జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీనిపై మంత్రి అన్బిల్ మహేష్ స్పందిస్తూ… ఇదివరకే ప్రకటించిన విధంగా జూన్ 1వ తేది నుండి పాఠశాలలు ప్రారంభమవుతాయని, ఎండ తీవ్రత అధికంగా ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.