– పంట మార్పిడితో సుస్థిర ఆదాయం సాధ్యం
– సేంద్రియ విధానాలతో నేల సారాన్ని కాపాడాలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నందిపాడు లో సోమవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన విభాగం ప్రొఫెసర్, హెడ్ ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని రైతులకు వివరించారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ తో పాటు ఇతర ఉద్యాన పంటల సాగుపై రైతులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చి పలు సూచనలు చేశారు.
అనంతరం స్రవంతి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. యూరియాను మితంగా వినియోగించడం వల్ల రైతులకు లాభం కలగడంతో పాటు నేల, నీటి కాలుష్యం తగ్గుతుందని వివరించారు. యూరియాను అధికంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి, భూసారానికి కలిగే నష్టాలను వివరించి, వాతావరణ మార్పుల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ఆరు ముఖ్య అంశాలపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగు, పంటల వైవిధ్యీకరణ, వాతావరణ అనుకూల సాగు వంటి అంశాలపై రైతులు ఆసక్తిగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కే. దుర్గ, వ్యవసాయ విస్తరణ అధికారి రవీందర్, పంచాయతీ కార్యదర్శి అలివేలు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ బాబ్జీ, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



