నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. అయితే ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, పరిశీలన అనంతరం ఎంత మంది మిగిలారనే వివరాలను అనే వివరాలు ఈసీ ఇంకా ప్రకటించ లేదు. రాష్ట్రంలోని17 పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి వివరాలు అందిన తర్వాత ప్రకటించన్నుట్టు ఈసీ వెల్లడించింది. నాగర్ కర్నూలు లోక్సభకు బీఎస్పీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ మంద జగన్నాదం నామినేషన్ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఆయన ఆ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికి బీ ఫాం అందించక పోవడంతో అది తిరస్కరణకు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రముఖుల నామినేషన్లు తిరస్కరణకు గురయినట్టు సమాచారం. కాగా ఉపసంహరణ గడువైన ఈ నెల 29 ముగిసిన తర్వాత పోటీలో నిలవబోయే తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.