కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం ప్రారంభోత్సవం
బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి పరిశీలన
నవతెలంగాణ-కాగజ్నగర్
రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు జూన్ రెండో తేదీన అంకురార్పణ జరగనుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చి సీఎం సభ స్థలాన్ని పరిశీలించారు. ఈయనతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు. రెండో తేదీన కాగజ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద సీఎం బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి ముందు కెరమెరి మండలం కొఠారి గ్రామంలో మొదటి విడతగా మంజూరైన 30 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంసభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవానికి అన్ని రంగాల్లో భరోసా, భధ్రతనిచ్చే ప్రజాప్రభుత్వం తమదని చెప్పారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇండ్లు మంజూరు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నాటికి 1.25 వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందని వివరించారు. జూన్ నాటికి 2.30 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇస్తామని, ప్రతి ఏడాదీ దశల వారీగా వీటిని అందిస్తామని, ఈ విషయంలో పేదలు ఆందోళనకు గురికావద్దని చెప్పారు. ఈ పర్యటనలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కె.ప్రేంసాగర్రావు, గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కె.హరిత పాల్గొన్నారు.
జూన్ 2న..రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



