లౌకికవాదులు ఒక్కటవ్వాలి

– 23న బీహార్‌లో ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమావేశం
– హాజరవుతున్న సీపీఐ(ఎం).. కేసీఆర్‌ కలిసి రావాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మోడీ 2024లో మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదం కనుమరుగవుతుందని, వాటిని రక్షించేవాళ్లు ఏకతాటిపైకి రావాలని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొందని, అన్ని పార్టీలు ఎన్నికల క్యాంపెయన్‌లు చేస్తున్నాయని తెలిపారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అది రాజ్యాంగానికి మరణ శాసనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలని ఒక వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఈనెల 23న బీహార్‌లో ప్రతిపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరుగనుందని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) హాజరవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేసీఆర్‌ కూడా హాజరుకావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. హాజరు కావడం హాజరు కాకపోవడం వారి ఇష్టమని, కానీ బీజేపీిని ఓడించడమే లక్ష్యంగా ఉంటే హాజరుపై ఆలోచించాలని కోరారు. తమకు కూడా కేరళలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉందని, అయినప్పటికీ బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు.
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టాలను తీసుకురాబోతుందని చెప్పారు. ఢిల్లీలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్‌ను అన్ని పార్టీలు ఖండించాయని, ఫెడరల్‌ వ్యవస్థను బలపరచాలన్న లక్ష్యం ఉన్న వారందరూ ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరారు. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను బలవంతంగా దేశంపై రుద్దేెందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. దీనివల్ల ప్రజల మధ్య విభజన సృష్టించి మత విద్వేషాలతో రాజకీయాలు చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి జాగా ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని, పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్నారు. పేదలు గుడిసెలు వేసుకుంటే పీకేయడం, కేసులు పెట్టడం సరింది కాదని ఆ చర్యలను మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్‌, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
త్రిపుర పార్టీకి రూ.16,200 సహాయం
త్రిపుర రాష్టంలో జరుగుతన్న హింసాకాండతో కమ్మునిస్టు పార్టీ కార్యకర్తలు అన్యాయనికి గురౌతున్నారని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సంఘీభావం తెలుపుతూ.. ఆదుకోవాలని కోరగా ముఖ్య కార్యకర్తలు స్పందించారు. ఎవరికి తోచిన వారు తమ వంతు సహాయంగా అందజేశారు. మొత్తంగా 16,200 రూపాయలు అందించారు. ఆ విరాళాలను త్రిపుర కమిటీకి అందజేస్తామని చెప్పారు.

Spread the love